HD Kumaraswamy | కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంతి, జేడీ(యూ) హెచ్డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, సమావేశానికి హాజరయ్యే ప్రతిపక్ష పార్టీల నేతలకు సేవలందించేందుకు 30 మంది ఐఏఎస్ అధికారులను నియమించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఐఏఎస్ బాండెడ్ లేబర్ విధానాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు రాష్ట్ర సామర్థ్యానికి, సమర్థతకు ప్రతీకలని, రాజకీయ నాయకులకు సేవ చేసేందుకు అధికారులను గేట్కీపర్లుగా నియమించడం అఖిల భారత సర్వీసుల నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనన్నారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు నియమించిన ఐఏఎస్ అధికారుల జాబితాను ఆయన విడుదల చేశారు. కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో కాంగ్రెస్ అహంకారాన్ని, వారసత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దగ్ధం చేసిందని ఆరోపించారు. తమ కూటమి నేతలకు సేవ చేసేందుకు ఐఏఎస్ అధికారులను నియమించడం ద్వారా కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ తప్పుచేసిందని.. మాటలకూ చేతలకూ తేడా లేదనడం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం అసలే కాదన్నారు. ఇది ఒక రాజకీయ సమావేశం మాత్రమేనని, ఈ కూటమి నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అధికారులను నియమించడం తీవ్ర అన్యాయమని, రాష్ట్రంలోని 6.5 కోట్ల మంది కన్నడ ప్రజలకు తీరని అవమానమని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు రాష్ట్ర సామర్థ్యానికి, సమర్థతకు ప్రతీక అని, రాష్ట్రాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తారని కుమారస్వామి పేర్కొన్నారు. ఆయా అధికారులను రాజకీయ నాయకులకు సేవ చేసేందుకు ‘గేట్కీపర్’గా వినియోగించడం అధికార పార్టీ దురహంకారాన్ని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు.
అయితే, ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని తెలిసినా అధికారులు ఆ పని చేయడానికి అంగీకరించడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇలాంటి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రెటరీ ఇందుకు బాధ్యత వహించాలన్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం బెంగళూరులో విపక్షాలు కీలక చర్చలు ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ హాజరయ్యారు.