జైపూర్: జిల్లా కలెక్టర్ అయిన ఐఏఎస్ అధికారిణి ఒక బీజేపీ నేతకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్లలో ఐదుసార్లు నమస్కరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిణి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. (IAS Officer Tina Dabi) బీజేపీ పాలిత రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ గత నెలలో బార్మర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టింది. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నది.
కాగా, రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియా కాన్వాయ్లో వచ్చారు. కారు దిగిన ఆయన మొబైల్ ఫోన్ చూడటంలో బిజీ అయ్యారు. అయితే బీజేపీ నేత సతీష్కు స్వాగతం పలికిన కలెక్టర్ టీనా దాబీ ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించింది. దీంతో టీనా దాబీ బాగా పని చేస్తున్నదని సతీష్ అన్నారు. బార్మర్ నగరాన్ని క్లీన్గా ఉంచుతున్నారని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయిస్తున్నారని ప్రశంసించారు. అలాగే ఆమెను చూసి దాదాగిరి చేస్తున్నావా? అంటూ జోక్ వేశారు. ఆమె బాగా పని చేస్తున్నదని, ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబీ వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2023లో తోటి ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను పెళ్లాడిన ఆమె నాడు వార్తల్లో నిలిచింది.
“दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।”#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf
— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024