IAS Avi Prasad | సీనియర్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని పరిపాలన, రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన పెళ్లి చేసుకున్న ముగ్గురు జీవిత భాగస్వాములు కూడా ఐఏఎస్ అధికారులే కావడం విశేషం.
2014 బ్యాచ్కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్.. 2017 బ్యాచ్కు చెందిన అంకితా థాక్రేను ఫిబ్రవరి 11వ తేదీన కూనో నేషనల్ పార్క్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అంకితా థాక్రే మధ్యప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సేవల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్మీడియాలో వైరల్ కావడంతో ఐఏఎస్ మూడో పెళ్లి హాట్ టాపిక్గా మారింది.
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందిన అవీ ప్రసాద్ 2014లో ఆలిండియా 13 వ ర్యాంక్ సాధించి సివిల్స్కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్కు సన్నద్దమవుతున్న సమయంలో రిజు బాఫ్నాతో అవీ ప్రసాద్కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఐఏఎస్ సాధించిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రిజు బాఫ్నా శాజాపూర్ జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్నారు. ఆ తర్వాత 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మిషా సింగ్ను అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మిషా సింగ్ మధ్యప్రదేశ్ కేడర్కు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్ల కాపురం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. మిషా సింగ్ ప్రస్తుతం రాత్లాం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని కీలక ఐఏఎస్ అధికారుల్లో అవీ ప్రసాద్ ఒకరు. కలెక్టర్గా పలు జిల్లాల్లో పనిచేయడమే కాకుండా, జిల్లా పంచాయతీ సీఈవోగా సేవలందించారు. కట్నీ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ఆయన తీసుకున్న చర్యలు విశేష గుర్తింపు పొందాయి. ప్రస్తుతం అవీ ప్రసాద్ మధ్యప్రదేశ్లోని ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్లో సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.