డెహ్రాడూన్: కొండ ప్రాంతంలో చిక్కుకుని మూడు రోజులుగా అక్కడ ఉన్న ఏడుగురు వ్యక్తులను భారత వాయుసేన (ఐఏఎఫ్) రక్షించింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డాకుమెంటరీ తీసేందుకు ముగ్గురు వ్యక్తులు నలుగురు పోర్టర్ల సహాయంతో నడుచుకుంటూ రుద్రప్రయాగ్ జిల్లాలో 4,500 మీటర్ల ఎత్తైన కొండల్లోని పాండవ్ షేరా ప్రాంతానికి ట్రెక్కింగ్కు వెళ్లారు. అయితే వెనక్కి తిరిగి వెళ్లే దారి తెలియక అక్కడ చిక్కుకున్నారు. వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోతుండటంతో సహాయం కోసం శుక్రవారం అత్యవసర సందేశం ‘ఎస్వోఎస్’ను పంపారు.
స్పందించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎడీఆర్ఎఫ్) అధికారి రిధిమ్ అగర్వాల్, ఎత్తైన కొండ ప్రాంతాల్లో రెస్క్యూ చేపట్టే బృందాన్ని సివిల్ హెలికాప్టర్లో శనివారం పంపారు. అయితే ఆ హెలీకాప్టర్ అంత ఎత్తుకు చేరుకోలేకపోయింది. దీంతో భారత వాయుసేన (ఐఏఎఫ్) సహాయం కోరారు. ఐఏఎఫ్ సిబ్బంది చీతా హెలీకాప్టర్లో ఏడుగురు చిక్కుకున్న ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేదు.
కాగా, సోమవారం ఉదయం ఐఏఎఫ్ సిబ్బంది రెండోసారి ప్రయత్నించారు. అక్కడ చిక్కుకున్న ఏడుగురిని ఉదయం 6.30 గంటలకు రక్షించారు. చమోలి జిల్లాలోని గౌచర్ ఎయిర్స్ట్రిప్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెడికల్ చెకప్ కోసం సమీపంలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఆసుపత్రికి తరలించారు.
వారంతా ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ అయ్యారని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ రాజ్వర్ తెలిపారు. ఏడుగురిలో నలుగురు పోర్టర్లతోపాటు ఒక వ్యక్తి ఉత్తరాఖండ్కు, మిగతా ఇద్దరు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్కు చెందిన వారని వెల్లడించారు.