న్యూఢిల్లీ: లఖిమ్పూర్ ఖేరిలో రైతులపైకి కారుతో దూసుకెళ్లాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిశ్ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఈ ఘటనపై మరోసారి స్పందించారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో తన కొడుకు అక్కడ ఉన్నట్లు ఒక్క ఆధారం దొరికినా తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ అజయ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం జరిగిన ఈ ఘటన, అనంతరం చెలరేగిన హింసలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి కొడుకే తన కారుతో రైతులపైకి దూసుకెళ్లాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆశిశ్ మిశ్రాపై పోలీసులు హత్య కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ సమయంలో తన కొడుకు అక్కడ లేడని, ఆందోళనకారులే కారుపై రాళ్ల దాడి చేసి డ్రైవర్ సహా ముగ్గురిని హత్య చేశారని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఆరోపిస్తున్నారు.