Shri Ram | మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఎన్సీపీ నేతపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఎంపీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని.. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో మాంసాహారం తిన్నాడని ఏ గ్రంథంలోనూ రాయలేదన్నారు. దుంపలు, పండ్లు తిన్నట్లుగా ప్రతిచోటా రాసి ఉందని.. అందుకు శాస్త్రాలే సాక్ష్యమన్నారు.
అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య ఎంపీపై మండిపడ్డారు. ఎంపీ వ్యాఖ్యలు అవమానకరమని, రామభక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ కేంద్ర ప్రభుత్వాలను కోరుతానన్నారు. రాముడి గురించి తప్పుగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జితేంద్ర అవద్పై కఠిన చర్యలు తీసుకోకుంటే చంపేస్తామని హెచ్చరిస్తున్నానన్నారు.
ఇదిలా ఉండగా.. షిర్డీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీరాముడు శాకాహారి కాదని.. మాంసాహారేనని ఎన్సీపీ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు అడవిలో నివసించే వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇంకా ఆయన గాంధీ, నెహ్రూలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఏం చెప్పినా.. గాంధీ, నెహ్రూలతోనే స్వాతంత్య్రం వచ్చిందన్న ఆయన.. స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు గాంధీజీ ఓబీసీ అనే విషయం వారికి (ఆర్ఎస్ఎస్) అంగీకారయోగ్యం కాదని.. గాంధీ హత్యకు వెనుక అసలు కారణం కులతత్వమేననంటూ వ్యాఖ్యానించారు.