చెన్నై, జూలై 4: తన పాలనలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నా, ప్రభుత్వ పాలసీలకు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినా, చేసిన తప్పునే పదేపదే చేసినా నియంతగా మారుతానని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. ఇందుకు ఎవరూ మినహాయింపుకాదని, కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సోమవారం స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఎవరైనా సరే చట్టం ప్రకారం నడుచుకుంటూ ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
మహిళా ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా వ్యవహరించాలని, తమ బాధ్యతలను భర్తలకు అప్పగించవద్దని కోరారు. మరోవైపు భారత్కు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసిందని, వారిని విడుదల చేయడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని స్టాలిన్ కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డీఎంకే ఎంపీ ఎ.రాజా డిమాండ్ చేశారు. సొంత దేశం అడిగే పరిస్థితి తీసుకురావొద్దన్నారు.