న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్.. తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు జ్ఞాపకాన్ని గురించి వెల్లడించారు. తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన తండ్రే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె చెప్పారు. అతను ఎప్పుడూ నన్ను కొడుతూ ఉండేవాడని, అందుకే అతనికి కనపడకుండా మంచం కింద దాక్కునే దాన్నని తెలిపారు.
అదేవిధంగా హోలీ పండుగ రోజు కొందరు యువకులు జపాన్ మహిళకు రంగులు పూసిన ఘటనపై కూడా స్వాతి మాలివాల్ స్పందించారు. ఆమె సాయం కోసం కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా రంగులు పూయడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తాము ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చామని ఆమె తెలిపారు. నిందితులను గుర్తించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.