న్యూఢిల్లీ : హిందుత్వ ఆరోపణలపై విమర్శలకు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. తాను హిందువునని.. అందుకే ఆలయాలను సందర్శిస్తానన్నారు. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదని, తాను నిత్యం ఆలయాలకు వెళ్లడంతో వారి సమస్య ఏమిటో చెప్పాలని కేజ్రీవాల్ విమర్శకులను కోరారు. ఆలయాలను సందర్శించడంలో తప్పు లేదని, అందరూ ఆలయాన్ని సందర్శిస్తారన్నారు. ఆలయ దర్శనం ద్వారా శాంతి లభిస్తుందని, అయితే అందులో తప్పేముంది? అంటూ ప్రశ్నించారు.
కొంత మంది దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో నాకు తెలియదు?.. వారి అభ్యంతరం నాకు అర్థం కావడం లేదన్నారు. తాను రాముడి, హనుమాన్ దేశాలయాలను సందర్శిస్తుంటానన్నారు. ఇదిలా ఉండగా.. గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరం సహా వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత నెలలో అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.