గువాహటి: ఒక వ్యక్తి తన ‘మరణ ధృవీకరణ పత్రం’ పోగొట్టుకున్నట్లు వార్తా పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఇది ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్, ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన ‘మరణ ధృవీకరణ పత్రం’ పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఆ డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్ ప్రకటన ఫొటోను ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు తన డెత్ సర్టిఫికేట్ను కోల్పోయినట్లు రంజిత్ కుమార్ పేపర్లో ఇచ్చిన ఈ ప్రకటనపై నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా స్పందించారు. ఆ వ్యక్తి స్వర్గంలో ఉన్నాడా? లేక నరకంలో ఉన్నాడా? అని కొందరు అడిగారు. ఒకవేళ ఆ ‘మరణ ధృవీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? అని మరొకరు ఫన్నీగా ప్రశ్నించారు.
‘ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి. దీనిని అర్జెంట్గా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఒకరు కామెంట్ చేశారు. ఒక వ్యక్తి తన ‘మరణ ధృవీకరణ పత్రం’ కోల్పోవడం ఇదే తొలిసారి అని మరొకరు చమత్కరించారు.
It happens only in #India😂😂😂 pic.twitter.com/eJnAtV64aX
— Rupin Sharma (@rupin1992) September 18, 2022