న్యూఢిల్లీ: తాను నిస్సహాయ స్థితిలో తన ఇంటికి వెళ్లినట్లు కారు హర్రర్లో మరణించిన అంజలి స్నేహితురాలు నిధి తెలిపింది. తన స్నేహితురాలు కారు కింద పడి ఇరుక్కున్న సంగతి డ్రైవర్కు తెలిసినప్పటికీ కారును ఆపకుండా ఆమెను ఈడ్చికెళ్లినట్లు ఆరోపించింది. దేశ రాజధాని ఢిల్లీలో న్యూఇయర్ రోజున 20 ఏళ్ల అంజలి సింగ్ నడుపుతున్న స్కూటీ వెనుక ఆమె స్నేహితురాలు నిధి కూర్చొని ఉంది. కారు ప్రమాదానికి ముందు వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.
కాగా, అంజలి నడుపుతున్న స్కూటీని కారు ఢీకొట్టగా కారు కింద అంజలి, మరోవైపు నిధి పడ్డారు. అయితే కారు ముందు చక్రం భాగంలో అంజలి కాళ్లు ఇరుక్కోవడంతో సుమారు 13 కిలోమీటర్ల వరకు ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీనిని చూసిన కొందరితోపాటు, నగ్నంగా మృతదేహం రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన మరి కొందరు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ ప్రమాదంలో మరోవైపు పడిన అంజలి స్నేహితురాలు నిధి కూడా దీనిని చూసింది. అయితే ఏమీ పట్టనట్లుగా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది.
అయితే ఈ ప్రమాదంతో భయపడిన తాను నిస్సహాయస్థితిలో తన ఇంటికి వెళ్లినట్లు మీడియాకు నిధి తెలిపింది. తాను ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, చాలా ఏడ్చానని చెప్పింది. కారు కింద అంజలి చిక్కుకున్న విషయం అందులో ఉన్న వారికి తెలుసని అన్నది. వారు రెండు సార్లు కారును వెనక్కి ముందుకు నడిపారని, ఆ తర్వాత ఆమెను ఈడ్చుకెళ్లారని వెల్లడించింది. దీంతో ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో తన ఇంటికి వెళ్లిపోయినట్లు నిధి వివరించింది.