ముంబై: బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి చెందినప్పటికీ అది తన పార్టీ కాదని అన్నారు. ఆమెను బీజేపీ పట్టించుకోకపోవడంతో అవసరమైతే ఆ పార్టీని వీడుతానంటూ పరోక్షంగా సంకేతం ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే కుమార్తె, మహారాష్ట్ర మాజీ మంత్రి అయిన పంకజా ముండే గురువారం ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. బీజేపీ పెద్ద పార్టీ అయినా, తనకు చెందని పార్టీ అని చెప్పారు. ‘నేను బీజేపీకి చెందిన దానినే. అయితే మా నాన్నతో సమస్య వస్తే మా అన్న ఇంటికి వెళతా’ అని అన్నారు. మహదేవ్ జంకర్ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్ఎస్పీ)ను ఉద్దేశించి ఆమె ఇలా వ్యాఖ్యానించారు.
కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజా ముండే ఓడిపోయారు. దీంతో గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్లో మంత్రిగా ఉన్న ఆమెను రాష్ట్ర బీజేపీ పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. అందుకే గత ఏడాది సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవి దక్కలేదన్న టాక్ వినిపిస్తున్నది. గోపీనాథ్ ముండే సన్నిహితుడైన జంకర్ కూడా ఇటీవల దీని గురించి మాట్లాడారు. ‘రిమోట్ కంట్రోల్ వేరొకరి వద్ద ఉంది. మా సోదరి పార్టీ వల్ల మా సంఘం ఎలాంటి ప్రయోజనం పొందదు’ అని అన్నారు. మరోవైపు బీజేపీ, పంకజా ముండే మధ్య విభేదాలు సృష్టించేందుకు కొంత మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గతంలో ఆరోపించారు.