పనాజీ: గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లూయీజిన్హో ఫలీరో ప్రత్యక్ష ఎన్నికల బరినుంచి తప్పుకున్నారు. తనకు కేటాయించిన స్థానంలో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. తనకు బదులుగా ఆ స్థానం నుంచి తమ పార్టీకి చెందిన ఓ యువతిని బరిలో దించుతున్నట్లు తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించడంలో అది మా విధామని ఆయన చెప్పారు.
మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు మమతాబెనర్జితో చర్చించిన తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని లూయీజిన్హ్ ఫలీరో తెలిపారు. తాను ఒక స్థానం నుంచి పోటీచేసి ఫోకస్ మొత్తం అక్కడే పెట్టడానికి బదులుగా ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకుని గోవాలో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థులందరి గెలుపు కోసం కృషిచేయడం మంచిదని భావించానని ఆయన పేర్కొన్నారు.
అందుకే తాను ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుని అక్కడి నుంచి సియౌలా వ్యాస్ అనే ఓ యువతిని బరిలో దించానని చెప్పారు. అమె ఫటోర్డాలో పార్టీ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేస్తున్నారన్నారు. కాగా గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.