పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మాన్చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఆప్ కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను రెచ్చగొట్టే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. చిల్లర రాజకీయాలకు దూరంగా వుంటానని, అందులో తలదూర్చనని పేర్కొన్నారు.
‘నాకు ఓటు వేయనివారికి కూడా నేను ముఖ్యమంత్రినే. ఇది వారి ప్రభుత్వం కూడా. వారి కోసం కూడా నేను పనిచేస్తాను. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికీ హక్కులుంటాయి. నన్ను అహంకారిగా ప్రజలు భావించుకోకూడదు. అలా ప్రవర్తిస్తాను.’ అని భగవంత్ మాన్ హామీ ఇచ్చారు. స్వాతంత్ర తదనంతర భారతం గురించే భగత్ సింగ్ ఎక్కువగా ఆందోళన చెందేవారని గుర్తు చేశారు. పంజాబ్ అభివృద్ధి కోసం పనిచేస్తానని, అన్నీ చిన్న సమస్యలేనని, ప్రతి దానికీ ఓ పరిష్కారం చూపిస్తామని భగవంత్ మాన్ ప్రకటించారు.