చండీగఢ్: నవజ్యోత్సింగ్ సిద్ధూ లాంటి ప్రమాదకారి నుంచి దేశాన్ని కాపాడటం కోసం తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని సిద్ధూ ఆశపడుతున్నాడని, కానీ ఆ ప్రమాదకరమైన వ్యక్తి అంతటి ఉన్నతమైన పదవిలోకి రాకుండా తాను అన్ని విధాలా అడ్డకుంటానని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయాన్ని అమరీందర్సింగ్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
సిద్ధూ పంజాబ్ సీఎం అయ్యేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని తాను అడ్డుకుంటానని అమరీందర్ సింగ్ చెప్పినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. సిద్ధూను ఎమ్మెల్యేగా కూడా గెలువకుండా చేయడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అతనిపై గట్టి అభ్యర్థిని నిలబెడుతానని అమరీందర్ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సోనియాగాంధీకి తాను మూడు వారాల క్రితమే రాజీనామా లేఖ పంపించానని, ఆమె తనను పిలిచి సీఎం పదవి నుంచి తప్పుకొమ్మని చెబితే గౌరవంగా ఉండేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపారు.
ప్రియాంకాగాంధీ, రాహుల్గాంధీ తన పిల్లల లాంటి వారని, తనను ఇంత అవమానకరంగా పదవి నుంచి తొలగించి ఉండాల్సింది కాదని, తన తొలగింపునకు పార్టీ అనుసరించిన వ్యూహం తనను చాలా బాధపెట్టిందని అమరీందర్సింగ్ ఆవేదన వ్యక్తంచేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. రాహుల్, ప్రియాంకలకు తన గురించి బాగా తెలుసని, వారి వెంట ఉన్న కొంతమంది వారికి తప్పుడు సలహాలు ఇచ్చారని ఆయన అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.