Mohammed Asfan | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్లోని బజార్ఘాట్కు చెందిన మహ్మద్ అస్ఫాన్(30) మరణించాడు. ఉద్యోగం పేరుతో ఏజెంట్ల చేతిలో మోసానికి గురైన అతను రష్యా సైన్యంలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్టు తెలుస్తున్నది.
మహ్మద్ అస్ఫాన్ యుద్ధంలో చనిపోయిన విషయాన్ని అధికారులు బుధవారం ధ్రువీకరించారు. రష్యా నుంచి తన కుమారుడిని తిరిగి రప్పించేందుకు సాయం చేయాలని అస్ఫాన్ కుటుంబసభ్యులు ఇటీవల ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కోరారు. దీంతో ఆయన మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించగా.. అస్ఫాన్ మరణించినట్టు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు.
ఉద్యోగం అంటూ మోసం
అస్ఫాన్ హైదరాబాద్లో బట్టల దుకాణంలో పనిచేసేవాడు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఏజెంట్ పరిచయమయ్యాడు. రష్యా రాజధాని మాస్కోలో ఉద్యోగాలున్నాయంటూ నమ్మించాడు. అస్ఫాన్ గత ఏడాది డిసెంబర్లో రష్యాకు వెళ్లాడు. అక్కడ రష్యా ఆర్మీకి హెల్పర్గా పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలోనే అస్ఫాన్ రష్యా తరపున యుద్ధంలోకి వెళ్లాల్సి రావడంతో, అక్కడి జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. మహ్మద్ అస్ఫాన్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అస్ఫాన్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు మాస్కోలోని భారత ఎంబసీ పేర్కొన్నది.
ఇటీవల గుజరాత్ యువకుడి మరణం
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యా ఆర్మీ హెల్పర్గా నియమితులైన గుజరాత్లోని సూరత్కు చెందిన హమిల్ మంగుకియా అనే 23 ఏండ్ల యువకుడు కూడా కొన్ని వారాల క్రితం మరణించాడు. హమిల్ ఒక ఆన్లైన్ ప్రకటన ద్వారా రష్యాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొన్నాడు. ఏజెంట్ల సమాచారం మేరకు ఆ తర్వాత అతను చెన్నై మీదుగా మాస్కో చేరుకొన్నాడు. అనంతరం అతన్ని రష్యా ఆర్మీలో సహాయకుడిగా నియమించారు.
బలవంతంగా యుద్ధంలోకి
సెక్యూరిటీ హెల్పర్లగా నియమించుకొన్న వారిని సరిహద్దుల్లో ఉక్రెయిన్ సైనికులతో బలవంతంగా యుద్ధంలోకి దించుతున్నారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. దీనిపై గత వారం స్పందించిన భారత విదేశాంగ శాఖ.. వీలైనంత త్వరగా బాధితులను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నది. రష్యా ఆర్మీకి సహాయకులుగా పనిచేసేందుకు 20 మంది వరకూ భారతీయులు వెళ్లినట్టు సమాచారం ఉన్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాన్ తెలిపారు.
బాధితులను దేశానికి తిరిగి తీసుకురావాలి: కేటీఆర్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ యువకుడి మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయి, చిక్కుకుపోయిన యువకులను తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.