న్యూఢిల్లీ: దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. భర్తకు వేతనం పెరుగుతున్నకొద్దీ భార్యలనూ ఉద్యోగాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. భర్త వేతనం నెలకు సుమారు రూ.40 వేల కంటే ఎక్కువ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగం చేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నది.
అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 నివేదిక ప్రకారం.. గ్రామాల్లో భర్తల వేతనం పెరుగుతున్న కొద్దీ భార్యలు ఉద్యోగం చేసే అవకాశాలు తగ్గిపోతుండగా.. పట్టణాలు, నగరాల్లో భర్తల వేతనం పెరుగుతున్నకొద్దీ ఉద్యోగం చేసేందుకు భార్యలకు అధిక ప్రోత్సాహం లభిస్తున్నది. పట్టణాల్లోని పురుషులు అధిక వేతనం కలిగి ఉన్న విద్యావంతులైన మహిళలను పెండ్లి చేసుకొనేందుకు మొగ్గుచూపడమే ఇందుకు కారణమని తేలింది.