Wife Maintenance | ఆదాయం లేకున్నా, విడాకులు తీసుకున్న భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడం భర్త విద్యుక్త ధర్మం అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అందుకోసం అన్స్కిల్డ్ లేబర్గా పని చేసి రోజూ రూ.300-400 సంపాదించొచ్చునని మెట్టికాయలు వేసింది. విడాకులు తీసుకున్న తన భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడానికి తనకు ఆదాయం లేదని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో సవరణ పిటిషన్ వేశారు. ఆ వ్యక్తి పిటిషన్ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.
విడాకులు తీసుకున్న దంపతులు ఇద్దరూ 2015లో పెండ్లి చేసుకున్నారు. కానీ తన భర్త, అత్తామామలు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య వర కట్న వేధింపుల కేసు పెట్టారు. అటుపై ఇంటి నుంచి వెళ్లిపోయిన సదరు మహిళ 2016 నుంచే తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ప్రిన్సిపల్ కోర్టులో తన భార్య గ్రాడ్యుయేట్ అని, టీచర్ గా పని చేస్తూ నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదిస్తుందని ఆయన ఆరోపించాడు. తాను తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన తల్లిదండ్రులు, సోదరీమణులను చూసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. కానీ తన భార్య రూ.10 వేల ఆదాయం పొందుతుందనే ఆధారాలు సమర్పించడంలో విఫలం అయ్యాడు. దీంతో ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.