అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రం చేసేందుకు పంజాబ్ రైతులు మరోసారి సిద్ధమయ్యారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన రైతులు బుధవారం
అమృత్సర్లోని బియాస్ పట్టణంలో సమావేశమయ్యారు. లాక్డౌన్, కరోనా నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఒక చోట చేరారు. ఇందులో మహిళలు, పెద్ద వయస్కులు కూడా ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు ఇండ్లకు తిరిగి రాని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిరసనలను తీవ్రం చేసేందుకు ఢిల్లీ సరిహద్దుకు వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం పలు వాహనాల్లో సింఘుకు బయలు దేరారు.
మరోవైపు కరోనా నిబంధనలు పాటించని రైతులను పోలీసులు నిలువరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.