Engineering | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : మనిషి ఎనిమిది గంటలు పనిచేస్తే.. ఏఐ (కృత్రిమ మేధ) నిర్విరామంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నది. దీంతో ఆయా రంగాల్లో ఏఐ ప్రాధాన్యత, వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ మేధ సాంకేతిక వినియోగం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ ఆయా వర్గాల్లో నెలకొన్నది.
ఇంజినీరింగ్ విద్య, సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల అవసరం భారీగా తగ్గొచ్చని ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సగానికిపైగా టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్ను రాస్తున్నదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అన్నారు. ఒక్క ఏడాదిలో సాఫ్ట్వేర్ కోడ్లన్నింటినీ ఏఐ రాయగలదని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై చెప్పారు.
ఏఐ వినియోగంతో రాబోయే 18 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను పక్కకు తప్పించొచ్చు అని అమెరికాకు చెందిన సోషల్ క్యాపిటల్ సీఈవో పలిహపితియా అభిప్రాయపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. ఇంజనీర్ పాత్ర కనుమరుగు కానుందని అన్నారు.