న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ వేరియంట్ ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం నాటికి దేశంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో అందరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, తప్పనిసరిగా రెండు డోసులు టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాక్సిన్ తీసుకోని వారు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని సిఫారసు చేస్తున్నారు. అయితే, ఇంతకు ముందు కరోనా సోకిన వ్యక్తులు సైతం ఒమిక్రాన్ వేరియంట్ బారినపడే ప్రమాదం ఉందా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నమవుతున్నాయి. ఏదైనా వైరస్ సోకిన తర్వాత దాంతో పోరాడేందుకు శరీరంలో సహజంగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అధ్యయనాల్లో తేలింది.
సీడీఎస్ఈ నిపుణులు ఏమంటున్నరంటే..?
కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల ప్రకారం గతంలో కరోనా సోకిన వ్యక్తులు కూడా కొత్త వేరియంట్ బారినపడే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ అనంతరం, శరీరంలో కొంత మొత్తంలో సహజంగా రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది, కొన్ని నెలల్లో తగ్గడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కరోనా కొత్త ఉత్పరివర్తనం స్వభావం గురించి సవివరంగా తెలిసే వరకు ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
తిరిగి సోకే ప్రమాదం ఉండొచ్చు!
సీడీసీ ప్రకారం.. కొన్ని నెలలు లేదా ఏడాది ముందు సెకండ్ వేవ్లో మహమ్మారి బారినపడ్డ వారికి రోగ నిరోధకశక్తి తగ్గే అవకాశం ఉన్నది. తద్వారా రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గి, మళ్లీ వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్కు రోగనిరోధక శక్తి 6 నెలలు, లేదంటే ఎక్కువ కాలం ఉంటుందని గతంలో అధ్యయనాలు పేర్కొన్నాయి. మరొక అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకులు గతంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత 10 నెలల వరకు తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.
టీ సెల్స్ స్పందనపైనే..
ఇంతకు ముందు కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో మెమొరీ టీ-సెల్స్ ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. తీవ్రమైన కరోనా వైరస్తో పోరాడేందుకు శరీరం శ్రమపడాల్సి ఉంటుంది. ఫలితంగా యాక్టివ్ మెమరీ టీ కణాలు ఏర్పడతాయి. ఇవి తర్వాత ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడే అవకాశం ఉంది. అయితే, తాజాగా వెలుగు చూసిన ఒమిక్రాన్ ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
రెండు డోసుల టీకా అవసరం
కరోనా సోకే ప్రమాదాన్ని నివారించేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ నుంచి కాపాడడంలో టీకాలు పెద్ద పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. రెండు మోతాదుల టీకా తీవ్రమైన ఇన్ఫెక్షన్, మరణాల నుంచి రక్షిస్తాయంటున్నారు. పలు అధ్యయనాలు బూస్టర్ డోసులు అత్యవసరమని పేర్కొంటున్నాయి.