‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారతదేశం) కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్తో నిండిన బీజేపీ) అవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పించింది. తాజాగా పంజాబ్లో నలుగురు మాజీ కాంగ్రెస్ మంత్రులు.. బీజేపీలో చేరారు. దీనిపై ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ స్పందించారు.
‘‘బీజేపీ ఎప్పుడూ సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంది. మరి ఇప్పుడేమైంది? పంజాబ్లో వాళ్ల పార్టీలో నాయకులను తయారు చేయలేకపోయిందా? లేక వాళ్ల లీడర్లలో సత్తా లేకనా? కాంగ్రెస్లోని చెత్తను తమ పార్టీలో చేర్చుకుంటోంది?’’ అని మల్వీందర్ సింగ్ ప్రశ్నించారు. ఏయే నేతల మీద భయంకరమైన అభియోగాలో చేసిందో.. వారినే బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవడం వెనుక మర్మమేంటని ఆయన అడిగారు.
దేశంలో కాంగ్రెస్ లేకుండా చేస్తామని బీరాలు పలికి.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలందర్నీ చేర్చుకోవడం హాస్యాస్పదమని అన్నారు. షామ్ అరోరా, బల్బీర్ సిధు వంటి నేతలపై బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారని.. వాళ్లనే ఇప్పుడు ఆ పార్టీలో చేర్చుకోవడం ప్రజలు చూస్తూనే ఉన్నారని హెచ్చరించారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఆ నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.