చండీఘడ్: ఖలిస్థానీ వేర్పాటువాది, వారీస్ పంజాబ్ దే నేత అమృత్పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దుస్తులు, వాహనాలు మారుస్తూ పోలీసుల కండ్లు కప్పి పారిపోతున్నాడు. శనివారం అమృత్పాల్ను పట్టుకునేందుకు ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు అతడు మెర్సెడిస్ బెంజ్ కారులో ప్రయాణించాడు. ఆ తర్వాత జలంధర్లోని సలేమా గ్రామంలో ఇసుజు కారులో అమృత్పాల్ కనిపించాడు.
తర్వాత జలంధర్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద బ్రీజా కారులో అమృత్పాల్ ప్రయాణిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ కారును వెంబడించి పోలీసులు పట్టుకున్న సమయానికి అమృత్పాల్ పారిపోయాడు. కారును, అందులోనే తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. మరోవైపు అమృత్పాల్ సింగ్ పరారీపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్పాల్ను పట్టుకునేందుకు ఆపరేషన్ చేసినప్పటికీ అతడు తప్పించుకున్నాడంటే నిఘా వైఫల్యమే కారణమని పేర్కొంది.