న్యూఢిల్లీ: భారత్లోని కుటుంబాల అప్పులు ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరుకొన్నాయని, 2023 డిసెంబర్ నాటికి జీడీపీలో 40 శాతం ఉన్నాయని ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తాజా నివేదిక పేర్కొన్నది. నిఖర ఆర్థిక పొదుపులు అత్యంత కనిష్ఠ స్థాయికి(జీడీపీలో 5 శాతం) పడిపోయాయని నివేదిక పేర్కొన్నది. ఈ పరిణామాలు దేశంలో ఆర్థిక సంక్షోభం పెరుగడానికి నిదర్శనమని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల నిఖర ఆర్థిక పొదుపులు జీడీపీలో 5.1 శాతానికి(2021-22లో 7.2%) పడిపోయాయని, ఇది ఐదు దశాబ్దాల కనిష్ఠమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. అదేవిధంగా కుటుంబాల వార్షిక ఆర్థిక అప్పులు 2021-22తో పొలిస్తే(3.8%), 2022-23లో జీడీపీలో 5.8 శాతం పెరిగాయి. అంటే దీనర్థం కుటుంబాలు తమ వినియోగ అవసరాలను తీర్చుకొనేందుకు ఎక్కువగా అప్పులపై ఆధారపడుతున్నారు. కాగా, మోతీలాల్ ఓస్వాల్ నివేదికపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని పేర్కొన్నది. బీజేపీ పాలనలో దేశంలో అధిక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి విపరీత పరిణామాలు చోటుచేసుకొన్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.