పనాజీ: ఒక వంతెన ప్రమాదం జరిగింది. దీంతో గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలా మంది విమాన ప్రయాణికులు ఫ్లైట్లు మిస్ అయ్యారు. బీజేపీ పాలిత గోవాలో ఈ సంఘటన జరిగింది. పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని జువారీ నదిపై ఉన్న వంతెనపై సోమవారం ఉదయం టెంపోను ఎస్యూవీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నేపథ్యంలో వంతెనపై ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 45 నిమిషాల తర్వాత భారీ క్రేన్ సహాయంతో ఢీకొన్న వాహనాలను తొలగించారు.
కాగా, వంతెనపై ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు గంటలకుపైగా వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఉదయం ఆఫీసులకు, ఉద్యోగాలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే దబోలిమ్ విమానాశ్రయానికి సకాలంలో చేరుకోలేక చాలా మంది తాము ప్రయాణించాల్సిన విమానాలను మిస్ అయ్యారు. దీంతో చేసేదేమీ లేక చాలా మంది తమ వాహనాల్లో తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న వాహనాల్లోని పిల్లలతో వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బందిపడ్డారు.
మరోవైపు విమాన ప్రయాణికులు ఫ్లైట్లను మిస్ కావడం గురించి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని విమానాశ్రయ అధికారి తెలిపారు. భారీ ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులకు గురైన విమాన ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.