హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ అర్చకులకు యథావిధిగా వేతనాలు అందుతున్నాయని తెలిపారు. శుక్రవారం నోవాటెల్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఉపేంద్రశర్మ సీఎంను కలిశారు. అర్చకుల సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరుతూ వినతిపత్రంతో కూడిన పంచాగాన్ని అందజేశారు. అర్చక వెల్ఫేర్ ట్రస్టు సభ్యులను వెంటనే నియమించాలని విజ్ఞప్తిచేశారు. కరోనా కారణంగా పలువురు అర్చకులు అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని, అర్చకులందరికీ మొదటి ప్రాధాన్యత కింద టీకాలు ఇప్పించాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ అర్చకులు, పేద బ్రాహ్మణులకు సముచిత అవకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్తుశాఖ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ సతీశ్, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.