న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ‘హెచ్ఐవీకి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం’ అనేది మనం ఏండ్లుగా వింటున్న ఓ నినాదం. హెచ్ఐవీ బారినపడి ఏటా వేల మంది మరణిస్తున్న నేపథ్యంలో.. ఓ ఆశాజనకమైన వార్తను శాస్త్రవేత్తలు వెల్లడించారు. హెచ్ఐవీని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ఓ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ప్రయోగ దశలో ఉన్న ఈ టీకా.. వలంటీర్లలో యాంటిబాడీస్ను మెరుగ్గా ఉత్పత్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ రెండు డోసుల వ్యాక్సిన్ను ఎనిమిది వారాల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్ఐవీలో ఉండే ఓ ప్రొటీన్ ఇంజినీరింగ్ వెర్షన్తో ఈ వ్యాక్సిన్ను తయారుచేసినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ హెచ్ఐవీ విభిన్న జాతులను గుర్తించగలిగే యాంటిబాడీస్ను ఉత్పత్తి చేస్తుందని, సంక్రమణం నుంచి రోగికి రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు
వెల్లడించారు.