న్యూఢిల్లీ: ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడ్ని 11 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 2011 సెప్టెంబర్ 23న ఒక వ్యక్తి కారును ర్యాష్గా డ్రైవ్ చేశాడు. రోడ్డుపై మరో వ్యక్తిని ఢీకొట్టి పారిపోయాడు. బదర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారుతో ఢీకొట్టి పారిపోయిన నిందితుడ్ని విమల్ చాంద్గా గుర్తించారు.
కాగా, నిందితుడు విమల్ చాంద్ చాలా ఏళ్లుగా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్నాడు. తనను గుర్తించకుండా రూపం మార్చుకున్నాడు. ఢిల్లీలోని అశోక్నగర్ ప్రాంతంలో గుట్టుగా జీవిస్తున్నాడు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు అన్ని చోట్ల వెతికారు. అంతరాష్ట్ర పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో కూడా పలు ప్రాంతాల్లో అతడి గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో విమల్ చాంద్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 11 ఏళ్ల తర్వాత శుక్రవారం అతడ్ని ట్రాప్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.