బెంగుళూరు:స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(Light Combat Aircraft) ట్విన్ సీటర్ శిక్షణ విమానాన్ని ఇవాళ భారతీయ వైమానిక దళానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అందజేసింది. బెంగుళూరులో ఈ కార్యక్రమం జరిగింది. హెచ్ఏఎల్ సీఎండీ సీబీ అనంతకృష్ణన్ ఆ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీకి అప్పగించారు. అదనంగా మరో 83 ఎల్సీఏ విమానాలను అందజేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చౌదరీ ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 97 ఎల్సీఏ విమానాలను ప్రొక్యూర్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాబోయే రోజుల్లో భారతీయ వైమానిక దళంలో మొత్తం 220 ఎల్సీఏ విమానాలు ఉంటాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమన్నారు. రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ.. ఇవాళ చరిత్రాత్మక రోజు అన్నారు. హెచ్ఏఎల్కు రావడం గర్వంగా ఉందన్నారు. అన్ని ఒప్పందాలకు సాక్షిగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఐఏఎఫ్కు తొలి ఎల్సీఏ ట్విన్ సీటర్ను అందజేశామని ఆయన చెప్పారు. కొన్నాళ్ల క్రితం యుద్ధ విమానాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.