ముంబై: హిందూ మతం ప్రమాదంలో పడిందని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఎత్తైన గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని, బహిరంగ మండపాల్లో నాలుగు అడుగుల ఎత్తు విగ్రహాలను మాత్రమే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ వేడుకలపై ఆంక్షలు విధించిన మాదిరిగా మహారాష్ట్రలో పరిస్థితి ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే విమర్శించారు. కొత్త నిబంధనల ప్రకారం గణేష్ ఉత్సవ్ జరుపుకోవడం కష్టమని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం క్రమంగా మహారాష్ట్రలో పండుగలను జరుపుకోని పరిస్థితిని సృష్టిస్తున్నదని విమర్శించారు.
తమ ఆందోళనను గవర్నర్ వద్ద వ్యక్తం చేసినట్లు నితేష్ రాణే చెప్పారు. ‘ఇటీవల ఇతర మతపరమైన పండుగలు జరుపుకున్నారు. వారు ఎలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కోలేదు. ఇప్పుడు హిందువులకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు? హిందూ మతం ప్రమాదంలో ఉంది. మా పండుగలను కాపాడమని మేము గవర్నర్తో చెప్పాము. లేదంటే థాకరే ప్రభుత్వం పండుగలను క్రమంగా అంతం చేసే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశాము’ అని ఆయన తెలిపారు.