ఆగ్రా: కొందరు ముస్లింలపై ఉన్న వ్యక్తిగత కక్షను తీర్చుకునేందుకు, శ్రీరామనవమి పండుగ రోజున మతఘర్షణలు సృష్టించేందుకు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కుట్ర పన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గోవును హత్య చేసి ఆ నెపాన్ని కొందరు ముస్లింలపైకి నెట్టేశారు. కఠినమైన గోవధ నిషేధ చట్టం కింద అమాయకులను ఇరికించి వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించారు. అయితే, పోలీసుల విచారణలో ఈ మొత్తం కుట్రకోణం బయటకు వచ్చింది.
ఆగ్రాలోని ఛట్టా ఏసీపీ ఆర్కే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ కేసులో అఖిల భారత హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ ప్రధాన కుట్రదారు. అతడికి మహమ్మద్ రిజ్వాన్, ఆయన కుమారులు మహమ్మద్ నకీం, మహమ్మద్ షన్నుతో వ్యక్తిగత కక్ష ఉంది. దీంతో శ్రీరామనవమి నాడు గోహత్య చేసి నెపాన్ని వారిపై నెట్టాలనుకున్నాడు. మార్చి 29న మెహ్తాబ్బాగ్ ప్రాంతంలో సంజయ్ స్నేహితులు, అనుచరులు గోహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత రిజ్వాన్, నకీం, షన్ను గోహత్యకు పాల్పడ్డారని హిందూ మహాసభ సభ్యుడు జితేంద్ర కుశ్వాహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు, నిందితులను అరెస్టు చేయాలని హిందూ మహాసభ సభ్యులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళన కూడా చేశారు.
మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర
ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న షన్నుతో పాటు ఇమ్రాన్ ఖురేషీ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా వారికి ఈ గోహత్యతో ఏ సంబంధమూ లేదని తేలింది. మరింత లోతుగా విచారించగా ఈ కుట్ర చేసింది సంజయ్ జాట్ అని పోలీసులు గుర్తించారు. కొందరు మైనారిటీల సహకారం తీసుకొని సంజయ్ జాట్ గోహత్యకు కుట్ర చేశారని పోలీసులు తేల్చారు.