Attack : పాకిస్థాన్ (Pakistan) లోని సింధ్కు చెందిన ముస్లిం లీగ్-నవాజ్ శాసనసభ్యుడు, మత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీ (Kheal Das Kohistani) పై దాడి జరిగింది. ఈ విషయంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) స్పందించారు. ప్రజా ప్రతినిధులపై దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై తాను కోహిస్తానీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, దాడిలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్టు చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. హిందూ నేత అయిన ఖేల్ దాస్ కోహిస్తానీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ శాసనసభ్యుడిగా, మత వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. సింధ్ రాష్ట్రంలో నిర్మించనున్న నూతన కాలువలకు ఇటీవల ఆయన ప్రణాళికను రూపొందించారు.
అయితే దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. శనివారం ఆయన సింధ్లోని తట్టా జిల్లా గుండా వెళ్తుండగా నిరసనకారులు సమాఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్పై కర్రలు, టమాటలు, బంగాళాదుంపలతో దాడి చేశారు. అయితే ఈ దాడిలో కోహిస్తానీకి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.