న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: హిమాలయాల్లో మంచు 23 ఏండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుందని తాజా నివేదిక హెచ్చరించింది. దీనివల్ల 200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు పొంచి ఉందని తెలిపింది. కాఠ్మాండుకు చెందిన పరిశోధనా సంస్థ ‘ఐసీఐఎంవోడీ’ విడుదల చేసిన ‘ద హెచ్కేహెచ్ స్నో అప్డేట్ 2026’ నివేదిక ప్రకారం, అఫ్ఘానిస్థాన్ నుంచి మయన్మార్ వరకు విస్తరించిన సుదీర్ఘ పర్వతశ్రేణి ‘హిందుకుష్ హిమాలయాల్లో’ మంచు పొర 2025 నవంబర్-2026 మార్చి మధ్యకాలంలో అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయింది.
రెండు దశాబ్దాల సగటుతో పోల్చితే 27.8 శాతం తక్కువగా ఉన్నది. మంచు కురిసిన తర్వాత అది నేలపై ఎంతసేపు నిలిచి ఉంటుందో తెలిపేది ‘మంచు పొర’. పర్వతాల శీతాకాల పరిస్థితికి ఇది కొలమానం. ఈ మంచు పొరల నుంచి నెమ్మదిగా విడుదలయ్యే నీరు.. 12 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలకు ఆధారమవుతున్నది.