లక్నో: దేశంలో ప్రస్తుతం హిజాబ్ అంశంపై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధించారు. దీనిపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గత ఆదివారం నిరసన తెలుపుతున్న ముస్లిం మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా 15 మంది ముస్లిం మహిళలు స్థానిక బజార్ రోడ్ వద్ద గుమిగూడారు. హిజాబ్కు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇంతలో ఒక పోలీస్ బృందం అక్కడకు వచ్చింది. ఇళ్లకు వెళ్లిపోవాలని నిరసనకారులకు పోలీసులు చెప్పారు. అయితే వారు లెక్క చేయక నినాదాలు కొనసాగించారు. దీంతో పోలీసులు ముస్లిం మహిళలపై లాఠీచార్జి చేశారు. అనంతరం నిరసనకారులపై కేసు నమోదు చేశారు. పోలీసులను బెదిరించినట్లు అందులో ఆరోపించారు.
మరోవైపు నిరసన చేస్తున్న ముస్లిం మహిళలపై పోలీస్ లాఠీచార్జికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఘజియాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
Muslim women wearing #Hijab were lathi-charged by Uttar Pradesh Police, this video is being told from Khora Colony of Ghaziabad. pic.twitter.com/CkwYHoq8jh
— Rubina Afaque (@RubinaAfaqueIND) February 16, 2022