తిరువనంతపురం : మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్కు అడ్మిన్గా ఉన్నారా?.. అయితే, ఇది మీకు పెద్ద ఊరటనిచ్చే వార్తే. ఆయా గ్రూప్లో వచ్చే అభ్యంతరకర సందేశాలపై గ్రూప్ అడ్మిన్లకు ఎలాంటి బాధ్యత ఉండదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో దాఖలైన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 2020లో ‘ఫ్రెండ్స్’ పేరుగల వాట్సాప్ గ్రూప్లో పిల్లలు లైంగిక చర్యలకు పాల్పడినట్లు చూపే వీడియోను షేర్ చేశారు. అయితే, గ్రూప్ను కోర్టును ఆశ్రయించిన పిటిషనరే క్రియేట్ చేయగా.. అడ్మిన్ కూడా అతనే. మరో ఇద్దరు అడ్మిన్లు సైతం ఉన్నారు. ఇందులో ఒకరిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్గా ఉండడంతో పిటిషనర్ను సైతం నిందితుడిగా చేర్చడంతో పిటిషనర్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్కు, ఇతర గ్రూప్ సభ్యులపై ఉన్న ఏకైక ప్రత్యేక హక్కు.. గ్రూప్లో ఎవరైనా జాయిన్ చేయొచ్చని, లేదంటే తొలగించవచ్చని కోర్టు విచారణ సందర్భంగా పేర్కొన్నది. వాట్సాప్ గ్రూప్లోని సభ్యుడికి గ్రూప్లో పోస్ట్ చేసిన వాటిపై నియంత్రణ ఉండదని.. నియంత్రించలేరని, సెన్సార్స్ చేయలేరని పేర్కొంది. ఒక చట్టం నిర్దేశిస్తేనే క్రిమినల్ చట్టంలో వికారియస్ (vicarious) లయబిలిటీని నిర్ణయించవచ్చని, ప్రస్తుతం ఐటీ చట్టంలో అలాంటిదేమీ లేదని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ పేర్కొన్నారు. ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ అడ్మిన్ మధ్యవర్తిగా ఉండలేడని న్యాయమూర్తి అన్నారు.