ముంబయి : కస్టడీ మరణాలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగరిక సమాజంలో కస్టడీ మరణం అనేది.. అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటి అని పేర్కొంది. పోలీసులు అధికారం ముసుగులో పౌరులను అమానవీయంగా హింసించలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీస్ కస్టడీలో చనిపోయిన వ్యక్తి తల్లికి రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. సునీతా కుటే అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ విభా కంకన్వాడీ, జస్టిస్ అభయ్ వాఘ్వాసేలతో కూడిన ఔరంగాబాద్ బెంచ్ తీర్పును వెలువరించింది.
షోలాపూర్కు చెందిన పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో 23 సంవత్సరాల తన కొడుకు మరణించాడని పిటిషన్ల్లో మహిళ పేర్కొంది. తనకు రూ.40లక్షల పరిహారం చెల్లించడంతో పాటు పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సునీత డిమాండ్ చేశారు. పిటిషన్పై విచారణ సందర్భంగా నాగరిక సమాజంలో అత్యంత ఘోరమైన నేరాల్లో కస్టడీ మరణం ఒకటి అన్న బెంచ్.. ప్రజల కదలికలను, నేరాలను నియంత్రించే అధికారం పోలీసులకు ఉన్నా.. అది సంపూర్ణం కాదని, అధికారం వినియోగం ముసుగులో ఏ పౌరుడిని హింసించరాదని, అమానవీయంగా ప్రవర్తించరాదని తీర్పులో పేర్కొంది.
రాజ్యామే పౌరుల ప్రాణాలకు రక్షణ అని, అధికారం ముసుగులో ఉద్యోగి అఘాయిత్యాలకు పాల్పడితే.. అలాంటి పౌరుడికి నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేంది. కస్టోడియల్ డెత్ కేసులో బాధ్యులైన పోలీసుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసే హక్కు రాష్ట్రానికి ఉందని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పిటిషన్ ప్రకారం.. సునీతా కూటే కుమారుడు ప్రదీప్ 2018 నవంబర్లో ట్రాక్టర్ నడుపుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతనిపై దాడి చేశారు. ప్రదీప్తో పాటు మరికొందరు దాడి చేశారని, ఈ క్రమంలో తన తనయుడు ప్రాణాలు కోల్పోయాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత సదరు పోలీసులపై పిటిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బాధితురాలి ఆరోపణలను పోలీసులు ఖండించారు.