కొచ్చి, డిసెంబర్ 8: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ వీణతోపాటు మరికొందరు రాజకీయ నాయకులకు శుక్రవారం ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీచేసింది. వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఐటీ సంస్థకు, కొచ్చిన్ మినరల్స్ అండ్ రటిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి మధ్య అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలన్న పిటిషన్ను విజిలెన్స్ స్పెషల్ కోర్టు డిస్మిస్ చేయడంపై గిరీశ్ బాబు అనే సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థతోపాటు కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నాయకులు పీకే కన్హలికుట్టి, వీకే ఇబ్రహీం కుంజు తదితరులకు కూడా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే బాబు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు పెండింగ్లో ఉండగానే పిటిషనర్ గిరీశ్ బాబు మరణించడంతో ఆయన తరఫున వాదించేందుకు కోర్టు గతంలో ఓ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించింది.