బెంగళూరు, మార్చి 20: వన్యప్రాణులకు చికిత్స చేసేందుకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ సమీక్షారెడ్డిపై ఒక నీటి ఏనుగు (హిప్పొపొటామస్) దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని త్యావరకొప్ప టైగర్, లయన్ సఫారీలో బెంగళూరుకు చెందిన సమీక్షారెడ్డి(27) కాంట్రాక్ట్ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నది.
సన్కాపర్ పక్షికి చికిత్స చేసేందుకు గురువారం రాత్రి 10.30 గంటలకు సఫారీలోని పశు వైద్యశాలకు వెళ్లింది. చికిత్స అనంతరం అక్కడున్న నీటి ఏనుగు శరీర ఉష్ణోగ్రతను థర్మల్ కెమరాతో పరీక్ష చేస్తున్న సమయంలో అది దాడి చేసింది. దాడిలో అస్వస్థతకు గురైన డాక్టర్ను చికిత్స కోసం శివమొగ్గలోని మ్యాక్స్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని త్యావరకొప్ప ఈడీ డాక్టర్ అమరాక్షర వెల్లడించారు. ఆమె మృతిపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.