న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఉదారత చాటింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా 125 డెస్టినీ స్కూటర్లను ఆర్మీ వెటరన్స్ డైరెక్టరేట్కి అప్పగించింది. దివ్యాంగులైన ఆర్మీ మాజీ సైనికులకు వీటిని ఉచితంగా ఇవ్వనున్నారు. అదనంగా అమర్చిన చక్రాల స్కూట్లర్లను బ్రిగేడియర్ సనాతన్ సింగ్, డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వెటరన్స్ (DIAV) బ్రిగేడియర్ వికాస్ భరద్వాజ్ సమక్షంలో హీరో మోటోకార్ప్ సీఎస్ఆర్ అధిపతి భరతేందు కబి వీటిని అందజేశారు.
కాగా, ఇప్పటికే ఇలాంటి వంద స్కూటర్లను దేశవ్యాప్తంగా దివ్యాంగ సైనికులకు అందజేసినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ‘హీరో వియ్ కేర్’ కార్యక్రమం కింద నిజమైన హీరోలకు డెస్టినీ స్కూటర్లు అందించడం గర్వకారణమని పేర్కొంది.
సుమారు రూ.70 వేల విలువైన డెస్టినీ స్కూటర్లను గుజరాత్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, కేరళలోని ఇండియన్ ఆర్మీ దివ్యాంగ సైనికులకు అందజేసినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది.