న్యూఢిల్లీ: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్ఫోర్స్ ఎంక్వయిరీలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, మరో 12 మంది సైనికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ MI-17v5 నెల రోజుల క్రితం తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై భారత వాయుసేన.. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ దర్యాప్తు దాదాపుగా పూర్తికావచ్చింది. త్వరలోనే ఓ నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. వాయుసేనలోని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దీనిపై భారత వాయుసేనగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.