న్యూఢిల్లీ: లిబియాకు చెందిన సాయుధ మాఫియా ముఠా 17 మంది భారతీయులను నెలలపాటు బంధించింది (Captive Indians Brought Back). వారి విడుదలకు భారత ఎంబసీ చొరవ చూపింది. ఈ నేపథ్యంలో వారంతా సురక్షితంగా తిరిగి భారత్ చేరుకున్నారు. ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పంజాబ్, హర్యానాకు చెందిన 17 మందిని ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.13 లక్షల మేర వసూలు చేసి వారిని మోసగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత భారత్ నుంచి దుబాయ్కు వారిని తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి అక్రమ మార్గాల్లో లిబియాకు తరలించారు.
కాగా, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా లిబియాలోని జ్వారా నగరానికి అక్రమంగా చేరుకున్న 17 మంది భారతీయులను అక్కడి సాయుధ మాఫియా మూఠా నిర్బంధించింది. ఈ నేపథ్యంలో ఆహారం, తాగునీరు లేక వారు అల్లాడిపోయారు. ఈ విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మే 26న ట్యూనిస్లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తమ వారిని విడిపించాలని వేడుకున్నారు.
మరోవైపు సుమారు నాలుగు నెలలపాటు సాయుధ మాఫియా ముఠా నిర్బంధంలో ఉన్న 17 మంది భారతీయులను వారి చెర నుంచి విడిపించేందుకు భారత ఎంబసీ కృషి చేసింది. రెండు నెలలపాటు లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. దీంతో జూన్ 13న 17 మంది భారతీయులను లిబియా అధికారులు కాపాడారు. అయితే తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ట్యూనిస్లోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నత స్థాయిలో లిబియాతో సంప్రదింపులు జరిపారు. దీంతో భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధికారులు అంగీకరించారు. ఈ నెల 19న భారత ఎంబసీకి వారిని అప్పగించారు. అయితే ఆహారం, నీరు, మందులు లేక అవస్థలు పడిన వారికి ఎంబసీ సిబ్బంది వాటిని ఏర్పాటు చేశారు. వారి వద్ద పాస్పోర్ట్లు లేకపోవడంతో అత్యవసర పత్రాలను మంజూరు చేశారు. ప్రయాణ టికెట్లను కూడా ఏర్పాటు చేసి విమానంలో భారత్కు పంపారు. దీంతో 17 మంది భారతీయులు ఆదివారం తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
కాగా, వీరిని భారత్కు తెచ్చేందుకు కీలకపాత్ర పోషించిన ఆప్ రాజ్యసభ సభ్యుడు విక్రమ్జిత్ సింగ్ సాహ్నీ దీనిపై స్పందించారు. ఈ యువకులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులను ఆయన కోరారు.
The Indian Nationals arrived in Libya after being duped by travel agents under the pretext of lucrative jobs in Italy and were detained by the mafia in Libya.
— India in Tunisia (@IndiainTunisia) August 21, 2023
With blessings of Akalpurakh Waheguru jee we spearheaded successful evacuation of 17 youth of Punjab & Harayana from gallows of death in Libya where unscruplous agents duped them after taking 13 Lakh each . @BhagwantMann @mlkhattar immediate Firs shd be registered against agents… https://t.co/J8s5Vqc3gx
— Vikramjit Singh MP (@vikramsahney) August 21, 2023