కొచ్చి: కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాట (Stampede) తన హృదయాన్ని కలచివేసిందని (Heartbroken) ప్రముఖ గాయని నిఖితాగాంధీ (Nikhita Gandhi) అన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఈ హృదయ విధారక ఘటన పట్ల సంతాపం వ్యక్తంచేశారు. కొచ్చిన్ వర్సిటీ (Kochi University) వార్షిక వేడుకలలో భాగంగా నిఖితా గాంధీ పాటల కచెరీని (Music Concert) ఏర్పాటు చేశారు. దీనికి టికెట్లు పెట్టడంతో టికెట్లు తీసుకున్నవారు లోపల, పలువురు ఆడిటోరియం బయట ఉన్నారు. విద్యార్థులంతా ఉత్సాహంగా ఉన్న సమయంలో హఠాత్తుగా వర్షం పడటంతో ప్రేక్షకులు షెల్టరున్న స్టేజి వైపు తోసుకుని వెళ్లడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో 60 మందికిపైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
కాగా ఈఘటనపై నిఖిత సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. కొచ్చిలో జరిగిన హృదయవిదారక ఘటన తనను కలచివేసిందన్నారు. తాను వేదికపైకి వెళ్లేలోపే తొక్కిసలాట చోటుచేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేయడానికి పదాలు సరిపోవని తెలిపారు. విద్యార్థుల ఆత్మలకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నాని వెల్లడించారు.