అహ్మదాబాద్: అక్కడ వివాహ వేడుక జరుగుతున్నది. ఆహ్వానితులంతా కల్యాణ వేదికలో ఆసీనులై ఉన్నారు. చుట్టాలు, బంధువులతో సరదాగా గడుతున్నారు. ఇంతలో ఆరోగ్య కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వేడుకకు వచ్చినవారిలో ఎవరెవరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారో చెక్ చేసుకున్నారు. రెండు డోసులు తీసుకోనివారిని, అసలు వ్యాక్సినే తీసుకోనివారిని గుర్తించారు. వెంటనే వారికి టీకా ఇచ్చారు. ఇదంతా గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (AMC) జరిగింది.
మున్సిపల్ కార్పొరేషన్లో వివాహ వేడుకలు జరుగుతున్న కమ్యూనిటీ హళ్లు, ఫంక్షన్ హాళ్లకు ఆరోగ్య కార్యకర్తల బృందాలు వెళ్తున్నాయని, వ్యాక్సివేన్ వేసుకోని వాళ్లు, రెండు టీకాలు తీసుకోనివారిని గుర్తిస్తున్నారని ఏఎంసీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇలా గురువారం రోజున మొత్తం 121 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు. ఇందులో మొత్తానికి వ్యాక్సిన్ వేసుకోనివారు కూడా ఉన్నారని చెప్పారు.
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఏడాది జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 79,96,297 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.