న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రస్తుతం చివరి దశలో ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. గురువారం ఆయన రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో ‘హర్ ఘర్ దస్తక్’పై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి వయోజనుడికి మొదటి డోస్ ఇచ్చేలా చూడాలని.. 12కోట్ల మందికిపైగా రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా టీకా, కరోనా-కంప్లైంట్ ప్రవర్తన అనే ఆయుధాలు ప్రభావంతంగా ఉంటాయన్న ఆయన.. వైరస్ పూర్తిగా తొలగిపోయే వరకు మనం విశ్రమించకూడదని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం వయోజన జనాభాలో 79శాతం మందికి మొదటి డోస్, 38 శాతం మందికి రెండో డోసుల టీకా ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతానికి ఉన్న మార్గాలపై చర్చించాలని కోరారు. దేశంలో అర్హత ఉన్న ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ అందేలా అందరం కలిసి ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ దస్తక్’లో భాగంగా రెండు డోసుల టీకా వేసేలా ప్రజలను ప్రోత్సహిద్దామన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేరందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యలపై కేంద్రమంత్రి సమీక్షించారు. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు నగరాల్లోని బస్, రైల్వేస్టేషన్లు, ప్రధాన మెట్రోస్టేషన్ల వద్ద టీకా కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.