న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఆదివారం కొత్తగా 17వేల కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొవిడ్ పాజిటివిటీ రేటు సైతం తగ్గుతుందని తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే మూడో రోజు కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. శనివారం 67వేల కొత్త కొవిడ్ పరీక్షలు చేశామన్నారు.
ఇటీవల కేసులు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 15వేల దిగువకు తగ్గితే ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో 28,867 కేసులు రికార్డవగా.. కరోనా మొదలైన నుంచి ఇదే అత్యధికం. ప్రస్తుతం ఢిల్లీలో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య స్థిరంగా కొనసాగుతుందన్నారు. అయితే, ఆంక్షల సడలింపుపై ప్రశ్నించగా.. కేసులు తగ్గుతున్నాయ్.. 15వేలకు తగ్గనివ్వండి.. ఆ తర్వాత చూద్దామన్నారు.