బెంగళూర్ : పెగాసస్ స్పైవేర్ ఉదంతం మనకు కొత్త కాదని, 10-15 ఏండ్ల కిందట..నరేంద్ర మోదీ సర్కార్ కొలువుతీరక ముందే స్పై, ఫోన్ ట్యాపింగ్ ఘటనలు వెలుగుచూశాయని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు. గతంలో పలు ప్రభుత్వాలతో పాటు ఆదాయ పన్ను శాఖ కూడా ప్రజల ఫోన్లను ట్యాప్ చేశాయని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ను ట్యాప్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
దేశ భద్రతకు, కర్నాటక ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోయినా ఇలా చేయడం తనను బాధించిందని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో సామాన్యుడికి ఊరట కల్పించేలా నేతలు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా పలువురు జర్నలిస్టులు, విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే నివేదిక కలకలం రేపిన సంగతి తెలిసిందే.