దేశ ప్రయోజనాల దృష్ట్యా సెక్యులర్ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ పిలుపునిచ్చారు. ఈ కూటమిలోకి కాంగ్రెస్ కూడా వస్తే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అసలు ఆ పార్టీ ఏ పరిస్థితిలో వుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలాగా కాంగ్రెస్ కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయిందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది కాబట్టే… ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పాటు కావాలని, అందులో కాంగ్రెస్ కూడా ఉండాలన్నారు. ఇదంతా దేశ భవిష్యత్తు దృష్ట్యా మాత్రమేనని అన్నారు.
పంజాబ్లో ఉన్న అంతర్గత పోరు వల్లే కాంగ్రెస్ ఘోరంగా ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని దేవెగౌడ అన్నారు. అంతేకాకుండా నేతలందర్నీ ఏకతాటిపైకి నడిపించడంలో నాయకత్వం విఫలమైందని విశ్లేషించారు. ఈ కారణాలే ఆమ్ఆద్మీకి రాచబాటలు వేశాయని దేవెగౌడ విశ్లేషించారు.