ఇంఫాల్, ఫిబ్రవరి 22: మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంలా మారి వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న మైతీల రిజర్వేషన్ అంశంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మైతీ వర్గీయులను ఎస్టీల జాబితాలో చేరుస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వును మణిపూర్ హైకోర్టు రద్దు చేసింది. మైతీ కులస్థులను షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత ఏడాది మార్చిలో జారీ చేసిన ఉత్తర్వులోని పేరాగ్రాఫ్ను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని విభేదించేలా ఉండటంతో దానిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో అనిశ్చితి, అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయని, సుమారు 200 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని కేసును విచారించిన జస్టిస్ గోల్మే గైఫుల్షిల్లు బుధవారం వ్యాఖ్యానించారు. తీర్పు ఉత్తర్వులు వెలువడిన నాలుగు వారాల్లోగా దీనిని తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.