న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Ramdas Athawale) స్పందించారు. ఉగ్రదాడులు ఇలాగే కొనసాగుతుంటే పాకిస్థాన్తో యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికే మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ ఉగ్రదాడి జరిగిందని ఆరోపించారు. ఎన్డీయే మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే కూడా కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజున రియాసీలో ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంపై సోమవారం ఆయన మాట్లాడారు.
కాగా, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం అంతమైందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. ‘జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం అంతమైందని నేను నమ్ముతున్నా. ప్రధాని మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మనం పాకిస్థాన్తో యుద్ధం ప్రారంభించాలి. చాలా మంది ఉగ్రవాదులు పీవోకే ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారు’ అని ఆయన అన్నారు.
మరోవైపు, జమ్ముకశ్మీర్లోని శివ్ ఖోరీ ఆలయం నుంచి ఖత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి 53 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సుపై పోనీ ప్రాంతంలోని టెర్యాత్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సులోని పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణించిన 9 మంది మరణించగా 41 మంది గాయపడ్డారు. ఆ బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది.
#WATCH | Delhi: On the Reasi terror attack, Union Minister Ramdas Athawale says, "…I believe terrorism has ended in the region of J&K. This attack was carried out deliberately, just to create fear as PM Narendra Modi forms the government for the third time. But, if such… pic.twitter.com/GFz9of1XW4
— ANI (@ANI) June 10, 2024