చండీగఢ్, జనవరి 1: బీజేపీ పాలిత హర్యానాలో ఓ మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా వ్యవహరించాడని పేర్కొంటూ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సందీప్సింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సదరు మహిళా కోచ్ మాట్లాడుతూ ‘నేను ఓ ఉద్యోగిని. అభివృద్ధి పనుల కోసం మంత్రితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే దురుద్దేశం గల మంత్రి నన్ను ఆయన దగ్గరికి వచ్చేలా ఒకరకమైన వాతావరణాన్ని సృష్టించాడు. ఓ సారి నన్ను జిమ్లో చూసిన మంత్రి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు. నీ నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ పెండింగ్లో ఉన్నదని, దీనికి సంబంధించి కలువాలని ఆ మెసేజ్లో ఉన్నది. దీంతో మంత్రిని కలువడానికి ఆయన క్యాంప్ ఆఫీసుకు వెళ్లాను.
దీంతో మంత్రి నన్ను ఓ క్యాబిన్లోకి తీసుకెళ్లాడు. డాక్యుమెంట్లను నా ముందు ఉంచాడు. అనంతరం నాపై చెయ్యి వేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నేను ఏడుస్తూ అరిచాను. అక్కడ ఉన్న సిబ్బంది నన్ను కాపాడలేకపోయారు. దీంతో మంత్రి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. మంత్రి వేధింపులపై ఎన్నాళ్లని మౌనంగా ఉంటామని ప్రశ్నించారు. తన లాంటి బాధితులు మరి కొంతమంది ఉండొచ్చని, అయితే మంత్రిని చూసి భయపడి ముందుకు రావడం లేదేమోనని వెల్లడించారు. ఒకవేళ తనకు న్యాయం జరిగితే మిగతా వాళ్లు కూడా ముందుకొచ్చే అవకాశముంటుందని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మరోవైపు తన పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సందీప్సింగ్ అన్నారు. ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు.